నార్లాపూర్ గ్రామానికి చెందిన కావలి మల్లేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రోడ్డుపై అపస్మారక స్థితిలో ఉండగా, అదే మార్గంలో వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే తన వాహనాన్ని ఆపించారు. ఆలస్యం చేయకుండా బాధితుడిని స్వయంగా తన వాహనంలో సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు చేపట్టారు.
ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడిన మంత్రి, బాధితుడికి అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రమాద సమయంలో సమయస్ఫూర్తితో స్పందించడం వల్ల బాధితుడికి సకాలంలో వైద్యసాయం అందిందని స్థానికులు పేర్కొన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు చూపిన సేవాభావాన్ని స్థానిక ప్రజలు, బాధితుడి కుటుంబ సభ్యులు అభినందించారు. ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా మానవతా దృక్పథంతో స్పందించిన మంత్రి చర్యలు ప్రశంసనీయమని కొనియాడారు. సకాలంలో స్పందించి ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచిన మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.: రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా నిలిచిన మంత్రి జూపల్లి కృష్ణారావు..



