సంచార జాతుల 75వ విముక్తి దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నాగర్కర్నూల్ జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ హాజరయ్యారు. అదనపు కలెక్టర్ బి. చెన్నయ్యతో కలిసి మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంచార, విముక్త జాతుల చరిత్ర, వారు ఎదుర్కొన్న సామాజిక పరిస్థితులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. గతంలో వివిధ కారణాలతో సామాజికంగా వెనుకబడిన ఈ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యత కల్పించడం ద్వారా వారి పిల్లలకు మెరుగైన భవిష్యత్తు అందించవచ్చన్నారు.
యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి, వాటి ప్రయోజనాలు పొందడంలో ఎదురయ్యే సమస్యలను అధికారులు పరిష్కరించాలని అన్నారు.
సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, గౌరవం లభించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులు, కుల సంఘాల నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.: సంచార జాతుల అభ్యున్నతికి ప్రత్యేక దృష్టి సారించాలి

