నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా విని, వాటిని చట్టప్రకారం పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 8 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఇందులో భూమికి సంబంధించినవి 4 ఫిర్యాదులు, తగిన న్యాయం చేయాలని కోరుతూ 3 ఫిర్యాదులు, భార్యాభర్తల మధ్య వివాదానికి సంబంధించిన ఒక ఫిర్యాదు ఉన్నాయి. ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు సూచనలు చేశారు.

ప్రజలు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావడానికి ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఎస్పీ తెలిపారు. మూడో వ్యక్తుల ప్రమేయం, పైరవీలు లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్ట పరిధిలో తమ సమస్యలకు పరిష్కారం పొందేలా పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రజలకు పోలీసులు మరింత చేరువ కావడం, వారి సమస్యలను న్యాయబద్ధంగా పరిష్కరించడం, జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

ప్రజావాణి వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు నేరుగా పోలీస్ ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యలను తెలియజేసే అవకాశం కలుగుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోలీస్ శాఖ సూచించింది.: ప్రజావాణిలో 8 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *