తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా సాయి గార్డెన్లో “డ్రగ్స్ రహిత తెలంగాణ మన అందరి ధ్యేయం” అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ IPS ఆదేశాల మేరకు జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పిల్లలను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. పిల్లలకు మంచి భవిష్యత్తు అందించడంతో పాటు సమాజం పట్ల గౌరవం పెరిగేలా పెంచాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువత డ్రగ్స్ నిర్మూలనలో ముందుండాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్ వినియోగం, విక్రయం, రవాణా లేదా గంజాయి సాగు గురించి సమాచారం తెలిసిన వారు టోల్ ఫ్రీ నెంబర్ 1908కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో TGNAB డీఎస్పీ బుచ్చయ్య, నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్ రెడ్డి, ఎస్సై గోవర్ధన్, ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రవిశంకర్, సైకియాట్రిస్ట్ డాక్టర్ ఫణికాంత్, ఈగల్ టీమ్ ఎస్సై రామ్ లాల్తో పాటు ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, పాన్ షాప్ యజమానులు, మెడికల్ షాప్ నిర్వాహకులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్లో ‘డ్రగ్స్ రహిత తెలంగాణ’పై అవగాహన సదస్సు




