జోగులాంబ గద్వాల జిల్లా దారూర్ మండల పరిధిలోని పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. శ్రీ వ్యాసరాయల వారిచే 15వ శతాబ్దంలో ప్రతిష్ఠించబడిన ఈ ఆలయంలో ఉడిపి ఫలిమారు పీఠాధిపతులు శ్రీ 1008 విద్యాదిశ శ్రీపాదుల స్వామిజీ, శ్రీ 1008 విద్యారాజేశ్వర శ్రీపాదుల వారి ఆధ్వర్యంలో 48వ చాతుర్మాస్య పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా స్వామీజీలు మూలరాముల సంస్థాన పూజలు నిర్వహించి, ఏకాదశ విధ హారతులను శాస్త్రోక్తంగా సమర్పించారు. అనంతరం శ్రీ ఆంజనేయస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఘనంగా స్వామీజీ జన్మదిన వేడుకలు

ఉడిపి పాలిమారు మఠం పీఠాధిపతి శ్రీ విద్యాదిశ శ్రీపాదుల స్వామివారి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వేద పండితుల ఆధ్వర్యంలో శాంతి యాగం, హోమ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామీజీకి పుష్పాభిషేకం, ముత్యాల కనకాభిషేకం నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.

ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయస్వామి అన్నప్రసాద ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక అన్నప్రసాద వితరణ చేపట్టారు. సుమారు 70 రకాల ఫలహారాలతో కూడిన అన్నప్రసాదాన్ని భక్తులకు అందించారు.

కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఆద్య చక్రవర్తి కేశవాచార్యులు, మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి అర్చకులు పరిమళాచారి, అర్చకులు ఆర్య వామనాచారి, ఆద్య మద్వాచారి, ఆద్య కిష్టాచారి, దేవస్థాన చైర్మన్ గిరిరావు, ఉడిపి వేద పండితులు, వారి కుటుంబ సభ్యులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.: ఆధ్యాత్మిక శోభతో పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి ఆలయం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *