నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కోడేరు మండలం పస్పుల గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలోని డిజిటలైజేషన్ కేంద్రాలను సందర్శించిన ఆయన బూత్ స్థాయి అధికారులు నిర్వహిస్తున్న పనులను పరిశీలించి, ఓటర్ల వివరాల నమోదు, మ్యాపింగ్, పెండింగ్ దరఖాస్తులు, వలస వెళ్లిన మరియు మరణించిన ఓటర్ల వివరాలపై ఆరా తీశారు.

ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి ఓటరు వివరాలను ఖచ్చితంగా ధృవీకరించి డిజిటలైజేషన్ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందేందుకు ప్రతి ఇంటిని సందర్శించి వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

71వ పోలింగ్ కేంద్రంలో మొత్తం 1,116 మంది ఓటర్లలో 938 మంది వివరాలను నమోదు చేసి 84 శాతం, 72వ పోలింగ్ కేంద్రంలో 852 మంది ఓటర్లలో 727 మంది వివరాలను నమోదు చేసి 85 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మిగిలిన ఓటర్ల సమాచారాన్ని వేగంగా నమోదు చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

వలస వెళ్లిన ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించడం, మరణించిన ఓటర్ల ధృవీకరణ పత్రాలను సేకరించడం, ప్రతి నమోదును మరోసారి పరిశీలించిన తర్వాతే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని బీఎల్‌వోలకు సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన ఆగస్టు 3 గడువులోగా 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేసి పారదర్శక ఓటరు జాబితా రూపొందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.: పస్పుల గ్రామంలో ఓటరు జాబితా డిజిటలైజేషన్‌పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *