నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తిలో నిర్మాణంలో ఉన్న గురుకుల పాఠశాల మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్సీ డా. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ముందుగా గురుకుల పాఠశాల నిర్మాణాన్ని పరిశీలించిన అధికారులు తరగతి గదులు, హాస్టళ్లు, భోజనశాల, వంటశాల, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్య ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వ ఆమోదిత మ్యాప్‌కు అనుగుణంగా పనులు చేపట్టాలని, ఇంజినీరింగ్ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా నిర్ణీత గడువులో నిర్మాణాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామీణ విద్యార్థులకు ఆధునిక విద్యా వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పేర్కొన్నారు.

అనంతరం పీహెచ్‌సీ నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, ప్రహరీ గోడ వంటి మౌలిక వసతులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ సామగ్రి నాణ్యతను నిరంతరం పరిశీలిస్తూ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

గ్రామీణ ప్రజలకు మెరుగైన విద్య, ఆధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను చేపట్టిందని అధికారులు తెలిపారు. పనులను గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని సంబంధిత అధికారులు హామీ ఇచ్చారు.: తూడుకుర్తిలో గురుకుల పాఠశాల, పీహెచ్‌సీ నిర్మాణ పనుల పరిశీలన..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *