నాగర్‌కర్నూల్, జూలై 25: నల్లమల్ల అటవీ ప్రాంతంలోని ప్రసిద్ధ శ్రీ లొద్ది మల్లయ్య స్వామి ఆలయాన్ని దర్శించాలనుకునే భక్తులకు ప్రత్యేక అనుమతి లభించింది. అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ చొరవతో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో), ఇతర అటవీ శాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపి ఈ అనుమతిని సాధించినట్లు వెల్లడించారు.

ఈ నిర్ణయంతో ఒక్క రోజు పాటు భక్తులు శ్రీ లొద్ది మల్లయ్య స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరం నిర్వహించే మూడు రోజుల ఉత్సవాలకు శాశ్వత అనుమతులు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో మరిన్ని చర్చలు కొనసాగిస్తామని చెప్పారు.

నల్లమల్ల ప్రాంతంలోని ప్రముఖ శివాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా నల్లమల్ల ప్రాంత అభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు, ప్రకృతి ఒడిలో వెలసిన శ్రీ లొద్ది మల్లయ్య స్వామి ఆలయానికి భక్తుల రాకను మరింత పెంచేందుకు చర్యలు చేపడతామని వివరించారు.

భక్తులకు మెరుగైన రహదారులు, తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు, భద్రత వంటి మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నల్లమల్ల ప్రాంత అభివృద్ధితో పాటు భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.: శ్రీ లొద్ది మల్లయ్య స్వామి దర్శనానికి ప్రత్యేక అనుమతి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *