నాగర్ కర్నూల్ జిల్లాలో రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ లాభదాయక పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. శనివారం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా, పంట ప్రదర్శన మరియు అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు ఒకే రకమైన పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని సూచించారు. జిల్లాలో ఎక్కువగా వరి సాగుపై ఆధారపడడం వల్ల ఆశించిన ఆదాయం రాకపోతుందని, రైతులు తమ భూమిలో కొంత భాగంలో వరి సాగు చేస్తూనే మిగతా భాగంలో కూరగాయలు, పండ్ల తోటలు, ఉద్యాన పంటలు సాగు చేయాలని తెలిపారు.

ప్రత్యేకంగా అధిక సాంద్రత పత్తి సాగు రైతులకు లాభదాయకమని పేర్కొన్నారు. ఎకరానికి సుమారు 25 వేల మొక్కలు పెంచే విధంగా సాగు చేస్తే తక్కువ కాలంలో మంచి దిగుబడి వస్తుందని, పంట త్వరగా చేతికి అందుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించినట్లు తెలిపారు. రైతులు ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు.అలాగే ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోందని, ఎకరాకు సుమారు ₹51,000 వరకు సబ్సిడీ రూపంలో మొక్కలు, డ్రిప్ సిస్టమ్, నిర్వహణ ఖర్చులు అందిస్తున్నట్లు తెలిపారు. మూడు సంవత్సరాల పాటు సాగు చేసిన తర్వాత నాలుగో సంవత్సరం నుంచి ఆదాయం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సమయంలో అంతర పంటలు వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.

రైతులు కొత్త పద్ధతులను నేర్చుకుని అమలు చేస్తే వ్యవసాయ రంగంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, హార్టికల్చర్ అధికారులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.: లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *