నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్‌లో సోమవారం కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం మరియు అనుబంధ వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దివ్యాంగుల ఆత్మీయ జిల్లా స్థాయి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగుల సమస్యలపై స్పందించారు.

ఈ సందర్భంగా ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి, దివ్యాంగులు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో చైర్మన్‌కు అందజేశారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, మోటార్ వెహికల్ సౌకర్యం, సదరం ధృవపత్రాలు, ఉపాధి అవకాశాలకు సంబంధించిన సమస్యలపై అధిక సంఖ్యలో వినతులు వచ్చాయి. దివ్యాంగుల న్యాయమైన కోరికలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ముత్తినేని వీరయ్య హామీ ఇచ్చారు.

దివ్యాంగులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష చేపట్టారు. గత 60 రోజుల్లో 29 జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన అనుభవంతో, రాష్ట్రంలోని ప్రతి దివ్యాంగుడి చెంతకు చేరుకొని వారి సాధికారత కోసం నిరంతరం పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ సమ్మేళనంలో జిల్లాలోని సుమారు 650 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. అనంతరం సామూహిక భోజనాలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షులు నరాందాస్ శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి మొల్గర పరుషరాములు, బంగారి పర్వతాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, వివిధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.: నాగర్‌కర్నూల్‌లో ఘనంగా దివ్యాంగుల జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *