నాగర్‌ కర్నూల్ మండలం గగ్గలపల్లి శివారులో ఉన్న మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ నిత్యం లీకేజీలకు గురవుతోంది. పైప్‌లైన్ పగిలిపోవడంతో వేల లీటర్ల తాగునీరు వృథాగా పోతుండటమే కాకుండా, సమీపంలోని మల్కాపూర్, పులిజాల గ్రామాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోతోంది. దీంతో గ్రామ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే ఇదే ప్రాంతంలో పైప్‌లైన్ లీకేజీ ఏర్పడగా అధికారులు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించారు. అయితే కొద్ది రోజులకే మళ్లీ అదే ప్రాంతంలో పైప్ పగిలిపోవడంతో మరమ్మతుల నాణ్యతపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపకుండా తాత్కాలిక మరమ్మతులతో కాలం గడుపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. పైప్‌ లైన్ తరచూ పగిలి పోవడం వల్ల తాగునీటి సరఫరా నిలిచిపోవడమే కాకుండా భారీగా నీరు వృథా అవుతోంది. వర్షాలు లేక నీటి కొరత తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ఇలా విలువైన తాగునీరు వృథా కావడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పైప్‌లైన్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం ఉన్నప్పటికీ, గగ్గలపల్లి శివారులో తరచూ జరుగుతున్న పైప్‌లైన్ లీకేజీలు ఆ లక్ష్యానికి అడ్డంకిగా మారుతున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్‌ను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి మల్కాపూర్, పులిజాల గ్రామాలకు నిరంతరాయంగా తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.: పట్టించుకోని మిషన్ భగీరథ అధికారులు తూతు మంత్రం గానే ఉద్యోగాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *