అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, డా. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అమూల్యమని తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. యువత అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం, వేగ నియంత్రణ, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు. ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలని, బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుకోవడమే అంబేద్కర్ ఆశయ సాధన అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేసి అన్ని వర్గాల పిల్లలు కలిసి చదివేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
వక్తలు మాట్లాడుతూ, అంబేద్కర్ సామాజిక, ఆర్థిక అణచివేతలను ఎదుర్కొని స్వయంకృషితో ఎదిగి జాతి గర్వించదగిన వ్యక్తిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.: అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి






