బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. శని గ్రహదోష నివారణ కోసం భక్తులు స్వామివారికి తిలతైల అభిషేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సార్థాసప్త జేష్ఠమాత సమేత శనేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేపట్టారు.

శ్రావణ మాసం శుక్ల పక్షం దశమి తిథి, శనివారం, జేష్ఠ, మూల నక్షత్రాల సందర్భంగా ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ శ్రావణ మాసంలో శనేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయని తెలిపారు. జన్మ, గోచార రీత్యా శని గ్రహదోషాలు ఉన్నవారు తమ శక్తిమేరకు స్వామివారిని ఆరాధించాలని సూచించారు.

అదేవిధంగా ఆలయంలో గోన బుద్ధారెడ్డి కాలం నాటి బ్రహ్మసూత్రం కలిగిన పరమశివునికి భక్తులు రుద్రాభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహించారు. నందీశ్వర స్వామివారికి కూడా ప్రత్యేక పూజలు చేపట్టారు.

పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్‌రావు, గ్రామ సర్పంచ్ టి. సుగుణమ్మ, కమిటీ సభ్యులు కెంచె రాజేష్, ప్రభాకరచారి, పుల్లయ్య, అడ్వకేట్ వీరశేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి, అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.: శ్రీ శనేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా తిలతైల అభిషేక పూజలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *