నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలోని ఆకునెల్లికుదురు గ్రామంలో నకిలీ డీఏపీ (DAP) ఎరువుల విక్రయం వెలుగులోకి వచ్చింది. సోమవారం మధ్యాహ్నం తాడూర్ మండల వ్యవసాయ అధికారి డి. సందీప్ కుమార్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) మేఘనాథ్, పోలీసు సిబ్బందితో కలిసి నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ అక్రమ వ్యవహారం బయటపడింది.

తనిఖీల సందర్భంగా ఆకునెల్లికుదురు గ్రామానికి చెందిన ముచ్చర్ల చంద్రమౌళి (52), కిరాణా వ్యాపారి, రైతులకు నకిలీ డీఏపీ ఎరువులు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం రైతులను విచారించగా దాదాపు 10 మంది రైతులకు ఈ నకిలీ ఎరువులను విక్రయించినట్లు సమాచారం లభించింది.

అధికారులు రైతుల వద్ద నుంచి మొత్తం 80 నకిలీ డీఏపీ బస్తాలు, 4 పాక్షికంగా ఉపయోగించిన డీఏపీ బస్తాలు, 14 ఖాళీ డీఏపీ సంచులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నకిలీ ఎరువులు కొనుగోలు చేసిన రైతుల్లో దేంది దయాకర్ రెడ్డి, దేంది చంద్రారెడ్డి, తిరుపతయ్య, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, భాగువ రెడ్డి, స్వామయ్య, భూపాల్ రెడ్డి, నాగమల్లయ్య తదితరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వ్యవసాయ అధికారి డి. సందీప్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు తాడూర్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ కె. బాలు నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో అధికారిక డీలర్ల వద్ద నుంచే బిల్లుతో కొనుగోలు చేయాలని, నకిలీ ఎరువులపై అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు: తాడూర్‌లో నకిలీ డీఏపీ ఎరువుల దందా బట్టబయలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *