నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని రెయిన్‌బో ప్రీ ప్రైమరీ స్కూల్‌లో మంగళవారం గ్రీన్ డే (హరితోత్సవం) వేడుకలను ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రకృతి పట్ల బాధ్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని పచ్చటి తోరణాలు, మొక్కలతో అందంగా అలంకరించడంతో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శిరీష, కరస్పాండెంట్ శ్రీరంగం సత్యనారాయణ చార్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో పలు మొక్కలను నాటారు. అనంతరం విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించడం కూడా ముఖ్యమని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణానికి హాని కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విద్యార్థులకు సూచించారు.

గ్రీన్ డే సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన నాటికలు, ప్రసంగాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు పర్యావరణ పరిరక్షణ, మొక్కల ప్రాధాన్యతపై సందేశాలు అందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

: రెయిన్‌బో ప్రీ ప్రైమరీ స్కూల్‌లో ఘనంగా గ్రీన్ డే వేడుకలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *