జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని జూరాల డ్యాం సమీపంలోని పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఈనెల 27, 28 తేదీల్లో ప్రత్యేక యాగపూజలు, హోమాలు, వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆద్య చక్రవర్తి కేశవాచార్యులు తెలిపారు.

ఈనెల 27న ఉడిపి పాలిమార్ పీఠాధిపతులు శ్రీ 1008 శ్రీ విద్యాదిశ శ్రీపాదుల వారి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక శాంతి యాగం, ఇతర పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఉడిపి వేద పండితుల ఆధ్వర్యంలో యాగపూజలు శాస్త్రోక్తంగా జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.

28న శ్రావణ పౌర్ణమి సందర్భంగా వరమహాలక్ష్మీ వ్రతాలు, యజుర్వేద ఉపకర్మ, హయగ్రీవ స్వామి జయంతి ఉత్సవం, యజ్ఞోపవీతధారణ, రక్షాబంధన్, శ్రావణ పౌర్ణమి ప్రవీతోపావనం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉడిపి పాలిమార్ పీఠాధిపతులు శ్రీ 1008 శ్రీ విద్యాదిశ శ్రీపాదుల వారు, శ్రీ 1008 విద్యారాజేశ్వర శ్రీపాదుల వారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు.

అనంతరం పీఠాధిపతుల ఆశీర్వచనం, పాదపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ నిర్వహించే నవగ్రహ హోమాలు, పవన హోమాలు కూడా కొనసాగుతాయని పేర్కొన్నారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు శ్రీ ఆంజనేయస్వామి అన్నప్రసాద ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వసతి కల్పించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు, పీఠాధిపతుల ఆశీర్వచనం పొందాలని అర్చకులు కోరారు.

పూజల్లో స్వయంగా పాల్గొనదలచిన భక్తులు 9959251123, 9949789241, 9440807109, 9440770020 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.: పెద్ద చింతరేవుల ఆలయంలో 27, 28న ప్రత్యేక యాగపూజలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *