తిమ్మాజిపేట్ పోలీస్ స్టేషన్‌లో పాలమూరు మహేందర్‌పై దాడి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు బాధ్యులైన తిమ్మాజిపేట్ ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను వెంటనే విధుల నుంచి తొలగించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాలమూరు మహేందర్‌ను బీఎస్పీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఎంక్వయిరీ కోసం పోలీస్ స్టేషన్‌కు పిలిచిన మహేందర్‌పై పోలీసులు దాడి చేశారనే ఆరోపణలు తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. బాధితుడు వెల్లడించిన వివరాల ప్రకారం తనపై తీవ్రంగా దాడి జరిగిందని, విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ తన మెడపై కాలు పెట్టగా, ఎస్సై తనపై మూత్ర విసర్జన చేశారని ఆరోపించినట్లు తెలిపారు.

ఈ ఘటనపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరపాలని బీఎస్పీ డిమాండ్ చేసింది. బాధిత మహేందర్ కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని, పోలీసుల రక్షణలోనే చికిత్స అందేలా చూడాలని కోరారు. మహేందర్ ఆరోగ్యం కుదుటపడిన అనంతరం ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని పృథ్వీరాజ్ తెలిపారు.

అలాగే బాధితుడితో పాటు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వారిని అక్కడే కొందరు బెదిరించారని, గొంతు పట్టుకున్నారని ఆరోపిస్తూ బీఎస్పీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్‌చార్జ్ సి.కళ్యాణ్, జిల్లా ఈసీ సభ్యుడు బాలస్వామి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీహర్ష ముదిరాజ్, అసెంబ్లీ అధ్యక్షుడు పరుశరామ్, మధు, శంకర్, ఆంజనేయులు, రాముడు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.: పాలమూరు మహేందర్‌పై దాడి ఆరోపణలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *