కార్మికులు తమ నిరసన కార్యక్రమాలను ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా మరియు ముందస్తు అనుమతి పొందిన ప్రాంతాల్లో మాత్రమే నిర్వహించాలని సూచించారు. అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు.
TGRTC బస్సులు, డిపో ఆస్తులు ప్రజా ఆస్తిగా భావించబడతాయని, వాటికి నష్టం కలిగిస్తే ‘Public Property Damage Act’ కింద కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నష్టపరిహారం కూడా బాధ్యుల నుంచే వసూలు చేయనున్నట్లు తెలిపారు.
ప్రజల రవాణా సౌకర్యం కోసం విధులకు హాజరయ్యే ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లకు పూర్తి భద్రత కల్పిస్తామని వెల్లడించారు. విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకోవడం, భయభ్రాంతులకు గురిచేయడం, బస్సులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, రోగులు వంటి సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ప్రధాన కూడళ్లు, డిపోల వద్ద సీసీ కెమెరాలు, వీడియో గ్రాఫర్ల ద్వారా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే సందేశాలు వ్యాప్తి చేసిన వారిపై ఐటి యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.: TGRTC సమ్మె నేపథ్యంలో కఠిన నిబంధనలు అమలు
