**నాగర్కర్నూల్:** కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నమ్మి ఓటు వేసిన ప్రజలు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
గాంధీ పార్క్ నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ప్లకార్డులు, బ్యానర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నల్లవెల్లి కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.
మహిళలకు ఇచ్చిన హామీలు, రైతు భరోసా, పెన్షన్లు, నిరుద్యోగ భృతి తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ఆయన ప్రశ్నలు సంధించారు. మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ వంటి హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు. రైతులకు సాగునీరు, విద్యుత్, ఎరువులు సకాలంలో అందడం లేదని ఆరోపించారు.
షాపుల్లో యూరియా అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, యాప్లో నమోదు చేసుకోవాలని చెప్పడం మాత్రమే సమస్యకు పరిష్కారం కాదన్నారు. విద్యుత్ సరఫరాలో కోతల కారణంగా వ్యవసాయ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందని మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలనే ప్రస్తుత ప్రభుత్వం భర్తీ చేస్తోందని, కొత్త ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టలేదని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు సాగునీరు, విద్యుత్, రైతుబంధు, ఎరువులు, ఇతర వ్యవసాయ సహాయాలు అందాయని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఏడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని, రైతులు, మహిళలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.: అసమర్థ కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ప్రజలకు దగా: మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి




