నాగర్‌కర్నూల్: హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ వ్యాప్తిని అరికట్టడంలో ప్రజల్లో అవగాహన అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. హెచ్‌ఐవీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికీ స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు.
తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ముమ్మర IEC ప్రచార కార్యక్రమం–2026లో భాగంగా బుధవారం నాగర్‌కర్నూల్‌లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హెచ్‌ఐవీపై భయపడాల్సిన అవసరం లేదని, సరైన అవగాహనతో వ్యాధి నివారణ సాధ్యమని అన్నారు. హెచ్‌ఐవీ ఎలా వ్యాపిస్తుంది, ఎలా వ్యాపించదు అనే విషయాలపై ప్రజలకు శాస్త్రీయ సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత విశ్వసనీయమైన వైద్య సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు.
హెచ్‌ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల పట్ల ఎలాంటి వివక్ష, అవమానం, నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. వారికి వైద్య సేవలతో పాటు కుటుంబ, సామాజిక మద్దతు అందించాలని కోరారు.
జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, విద్యాసంస్థలు, ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. “Be Positive To Prevent HIV Positive” నినాదంతో చేపడుతున్న ప్రచారంలో హెచ్‌ఐవీ నివారణ, ముందస్తు పరీక్షలు, వైద్య సేవలు, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రవి నాయక్, విద్యార్థులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.: హెచ్‌ఐవీ నివారణకు అవగాహనే ప్రధాన ఆయుధం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *