బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆషాఢ మాసం కృష్ణ పక్ష దశమి, రోహిణి నక్షత్రం సందర్భంగా శని గ్రహ దోష నివారణ కోసం భక్తులు స్వామివారికి తిలతైల అభిషేకాలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు వైభవంగా జరిగాయి.

ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ.. ఈ మాసంలో శనేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ద్వారా స్వామివారి అనుగ్రహం, విశేష ఫలితాలు లభిస్తాయని తెలిపారు. జన్మ రీత్యా, గోచార రీత్యా శనిగ్రహ దోషాలు ఉన్న భక్తులు తమ శక్తిమేరకు స్వామివారిని పూజించాలని సూచించారు.

అదేవిధంగా ఆలయంలో గోన బుద్ధారెడ్డి కాలం నాటి బ్రహ్మసూత్రం కలిగిన పరమశివునికి భక్తులు రుద్రాభిషేకం, అర్చనలు, దీపారాధన నిర్వహించారు. నందీశ్వర స్వామివారికి కూడా ప్రత్యేక అర్చన పూజలు చేశారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, గ్రామ సర్పంచ్ టి. సుగుణమ్మ, కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.: శ్రీ శనేశ్వర స్వామికి భక్తిశ్రద్ధలతో తిలతైల అభిషేకాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *