పెద్దకొత్తపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జొన్నలబొగూడ బస్ స్టేజీ సమీపంలోని 167 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మామిడి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం ఓ బైక్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.
స్థానికుల వివరాల ప్రకారం, అతి వేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో కుమ్మరి తేజ (20), ఆరేపల్లి ఆంజి (19) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడగా, అతడిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద తీవ్రతకు బైక్ పూర్తిగా దగ్ధమైంది. ఘటన అనంతరం బొలెరో డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. సమాచారం అందుకున్న పెద్దకొత్తపల్లి ఎస్సై సతీష్ పోలీసు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం కొల్లాపూర్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.: ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు యువకులు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *