జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలోని పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో 48వ చాతుర్మాస్య మహోత్సవాలు ఈ నెల ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 25 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆద్య చక్రవర్తి కేశవాచార్యులు తెలిపారు.

18వ శతాబ్దంలో వెలసిన ఈ పురాతన ఆలయం శ్రీ వ్యాసరాయలచే ప్రతిష్ఠించబడగా, శ్రీ శేషదాసుల వారిచే బహిర్గతమైన పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ మహోత్సవాల్లో ఉడిపి పలిమారు మఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ 1008 శ్రీ విద్యాధీశ తీర్థ శ్రీపాదుల వారు మరియు శ్రీశ్రీశ్రీ 1008 శ్రీ విద్యారాజేశ్వర తీర్థ శ్రీపాదుల వారు పాల్గొని ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు శ్రీమన్న్యాయసుధా పాఠం, సంస్థాన పూజలు నిర్వహించబడతాయి. అనంతరం 10:30 నుంచి 11:30 గంటల వరకు శ్రీరామాయణం, భాగవతంపై ప్రత్యేక ప్రవచనాలు పీఠాధిపతులచే అందించబడతాయి.

అదేవిధంగా భక్తుల కోసం ప్రతిరోజూ పవమాన హోమం, నవగ్రహ హోమం, సంపూర్ణ సేవ, సంస్థాన పూజ, పాదపూజ, తులాభార పూజ, తొట్టెల పూజ వంటి విశేష సేవలు నిర్వహించనున్నారు. పూజా సామగ్రి కోసం నిర్ణీత రుసుము చెల్లించి భక్తులు ఈ సేవల్లో పాల్గొనవచ్చు.

శ్రీ పెద్ద చింతరేవుల అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం అల్పాహారం, టీ, కాఫీ, మధ్యాహ్నం అన్నప్రసాదం, సాయంత్రం టీ, కాఫీ, రాత్రి అల్పాహారం లేదా అన్నప్రసాదం భక్తులకు ఉచితంగా అందించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఈ ప్రాంతంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ ఆంజనేయస్వామి వారి కృపాకటాక్షాలను పొందాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.: 48వ చాతుర్మాస్య మహోత్సవాలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *