తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థాయి జనసేన ఆత్మీయ సమ్మేళనం ఈనెల 29న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జనసైనికులు, వీర మహిళలు, పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి హైందవ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు జనసేన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతోందని అన్నారు. జనసైనికులు, వీర మహిళలు పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు.

పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని హైందవ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమ్మేళనాల ద్వారా పార్టీ శ్రేణుల మధ్య మరింత ఐక్యత పెంచడంతో పాటు, రాబోయే రోజుల్లో రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువచ్చే దిశగా కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.

తెలంగాణలో జనసేనను బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున యువతను పార్టీలోకి తీసుకువస్తామని తెలిపారు. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేసేలా పార్టీని విస్తరిస్తామని చెప్పారు.

గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీ కార్యకలాపాలు కొంత మందగించాయని, ఇకపై ఆత్మీయ సమ్మేళనాల అనంతరం పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హైందవ రెడ్డి అన్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించడంతో పాటు, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పనిచేస్తామని తెలిపారు.

నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.: ఈనెల 29న నాగర్‌కర్నూల్‌లో జనసేన ఆత్మీయ సమ్మేళనం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *