జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.
జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల కోసం కనీసం నెలకు రూ.2,000 కోట్లు విడుదల చేయాలని కోరారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఉద్యోగుల చందాలతో నిర్వహిస్తున్న హెల్త్ స్కీంను మరింత పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరో రెండేళ్లు వేచి ఉండాలని చెప్పడం ఉద్యోగులను మభ్యపెట్టడమేనని నాయకులు విమర్శించారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అనివార్యంగా ఆందోళన చేపడుతున్నామని, రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ సంఘాలు, జేఏసీలు చేపట్టిన ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో టీజీఈజేఏసీ నాయకులు, టీఎస్యూటీఎఫ్, పండిత పరిషత్, టీఎన్జీవో, పంచాయతీ సెక్రటరీ, సీపీఎస్ సంఘం నాయకులు పాల్గొన్నారు.: సెప్టెంబర్ 10న ‘ఉద్యోగుల హక్కుల సాధన సభ’కు భారీగా తరలిరండి – టీజీఈజేఏసీ పిలుపు
