నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన లింగమయ్య స్వామి ఆలయంలో నిర్వహించబడనున్న సలేశ్వరం జాతరకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరగనున్న ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.

గురువారం కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి నల్లమల అటవీ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా సందర్శించి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. అడవి ప్రాంతంలోని క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఏడాది పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.

భక్తుల సౌకర్యార్థం తాగునీటి సరఫరా, వైద్య సేవలు, తాత్కాలిక శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. అడవి మార్గాల్లో దర్శనానికి వచ్చే భక్తులకు స్పష్టమైన మార్గదర్శక బోర్డులు ఏర్పాటు చేయడం, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక సూచనలు ఉంచడం, అవసరమైన చోట్ల సిబ్బందిని నియమించడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతర సమయంలో శుభ్రత నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చెత్తను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన సందర్భంలో వెంటనే స్పందించేందుకు వైద్య బృందాలు, అంబులెన్స్ సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అగ్నిప్రమాదాల నివారణ కోసం ఫైర్ సిబ్బంది, ఫైర్ ఇంజిన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

భక్తుల రద్దీని నియంత్రించేందుకు ముఖ్య ప్రాంతాల్లో మైక్ సిస్టమ్ ఏర్పాటు చేసి సమాచారాన్ని అందించాలన్నారు. పోలీస్ శాఖ ద్వారా ప్రత్యేక ఔటోపోస్ట్ ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఎవరైనా తప్పిపోయిన సందర్భంలో వెంటనే గుర్తించి కుటుంబ సభ్యులకు చేరవేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాను విస్తరించడంతో పాటు చల్లని నీడ కల్పించే టెంట్లు, షెడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.ప్రత్యేకంగా గర్భిణీ మహిళలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు జాతరకు రాకుండా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నల్లమల అడవిలోని క్లిష్ట ట్రెక్కింగ్ మార్గాలు, అధిక ఉష్ణోగ్రతలు ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున ఈ సూచనలు చేసినట్లు తెలిపారు.

భక్తులందరూ సురక్షితంగా ఉండేలా అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ స్వామి దర్శనం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.: సలేశ్వరం జాతరకు విస్తృత ఏర్పాట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *