నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో నిర్మాణంలో కొనసాగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఆయన నిర్మాణ ప్రదేశాన్ని ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం జూన్ నాటికి అకాడమిక్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యేలా పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రణాళికాబద్ధంగా పనులు కొనసాగించాలని అన్నారు.

పాఠశాలలో ఆధునిక తరగతి గదులు, విశాలమైన డార్మిటరీలు, త్రాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య వసతులు, క్రీడా మైదానాలు వంటి అన్ని మౌలిక సదుపాయాలను నాణ్యతతో నిర్మించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తరువాత విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన విద్యా వాతావరణం అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.: తూడుకుర్తి యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగవంతం చేయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *