జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 8,68,977 బస్తాల యూరియా రైతులకు పంపిణీ చేయగా, అందులో 3,30,660 బస్తాలు యాప్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు 66,141 మంది రైతులు యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు.
గత యాసంగి సీజన్తో పోలిస్తే ఈసారి జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 66 వేల ఎకరాలు పెరగడం వల్ల యూరియా డిమాండ్ కూడా పెరిగింది. ఈ పెరిగిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. గత సంవత్సరం యాసంగి తో పోలిస్తే ఈ యాసంగి లో 2,32,667 బస్తాల యూరియా అధికంగా పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ నెలలో జిల్లాకు మరో ఒక లక్ష బస్తాల యూరియా కేటాయించబడింది.జిల్లాలో పని చేస్తున్న ADAలు, AOలు మరియు AEOలు యూరియా అవసరం ఉన్న రైతులను గుర్తించి యాప్ ద్వారా బుకింగ్ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. డీలర్లు, వాలంటీర్లు కూడా రైతులకు సహకరించాలని ఆయన కోరారు.
అదేవిధంగా రైతులు పంటలకు అవసరమైన మేర మాత్రమే యూరియా వాడాలని సూచించారు. అధిక మోతాదులో ఎరువులు వాడటం వల్ల నేల సారం తగ్గి భవిష్యత్తులో పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.: నాగర్ కర్నూల్ జిల్లాలో యాప్ ద్వారా యూరియా పంపిణీ
