నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణకు సంబంధించిన హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 14 మంది అర్హులైన బాలికలకు టీకాలు అందజేసినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ టి. ప్రసన్న తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ టి. ప్రసన్న మాట్లాడుతూ, గర్భాశయ క్యాన్సర్ మహిళల్లో అధికంగా కనిపించే ప్రమాదకర వ్యాధులలో ఒకటని, దీనిని ముందస్తుగా నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అర్హులైన బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు.
ప్రత్యేకంగా 2011 ఏప్రిల్ 1 నుండి 2012 మార్చి 31 మధ్య జన్మించిన బాలికలు తప్పనిసరిగా ఈ టీకాను వేయించుకోవాలని ఆమె సూచించారు. ఈ టీకా గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే వైరస్‌పై రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న 99 రోజుల ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య వారోత్సవాలను నిర్వహిస్తూ, ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ టీకా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ మేఘనా రెడ్డి, నర్సింగ్ అధికారి స్వరూప రాణి, పర్యవేక్షకులు బాలమణి, మహిళా ఆరోగ్య కార్యకర్తలు వరలక్ష్మి, జ్యోతి, విజయలక్ష్మి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారు బాలికలకు టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, భయాలు, అపోహలను తొలగించేలా వివరించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను సమయానికి టీకాలు వేయించేందుకు ముందుకు రావాలని, ఆరోగ్యశాఖ సూచనలను పాటించాలని వైద్యులు కోరారు. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ కేసులను గణనీయంగా తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.: లట్టుపల్లి పీహెచ్‌సీలో బాలికలకు హెచ్‌పీవీ టీకాల పంపిణీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *