నాగర్‌కర్నూల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ సైన్స్ కళాశాలలో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాగర్‌కర్నూల్ శాఖ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంగన మోని బంగారు బాబు మాట్లాడుతూ, హిందుత్వానికి, దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరుగా నిలిచిన మహానీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని శివనేరి కోటలో జన్మించిన శివాజీ మహారాజ్ చిన్ననాటి నుంచే స్వరాజ్య స్థాపన లక్ష్యంగా ముందుకు సాగారని తెలిపారు.

తల్లి జీజాబాయి బోధించిన ధర్మం, దేశభక్తి విలువలతో ఎదిగిన శివాజీ మహారాజ్, మొఘల్ సామ్రాజ్యం మరియు బీజాపూర్ సుల్తానుల శక్తిని ఎదుర్కొని అనేక కోటలను స్వాధీనం చేసుకున్నారని వివరించారు. తొర్నా కోట తొలి విజయమని, గెరిల్లా యుద్ధ విధానంతో శత్రువులను మట్టికరిపించిన ధీరుడని పేర్కొన్నారు. 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో పట్టాభిషేకం పొంది “ఛత్రపతి” బిరుదు అందుకున్నారని గుర్తు చేశారు.

రైతుల సంక్షేమం, మహిళల గౌరవ పరిరక్షణ, న్యాయపాలనతో ప్రజల మనసు గెలుచుకున్న మహానాయకుడు శివాజీ మహారాజ్ అని తెలిపారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రసాద్ కుమార్, నగర సంయుక్త కార్యదర్శి శివ, మల్లేష్ యాదవ్, రమేష్, జీవన్, భరత్, దేవిక, కీర్తనతో పాటు ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.: శివాజీ మహారాజ్ నవతరానికి స్ఫూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *