నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రసిద్ధ సలేశ్వరం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, అదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్, డీఎఫ్ఎ రేవంత్ చంద్ర తదితరులతో కలిసి జాతర ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రాత్రి సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వైద్య శాఖ ద్వారా పలు చోట్ల ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్స్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని, తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
అదేవిధంగా గర్భిణీ మహిళలు, వృద్ధులు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు జాతరకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ మాట్లాడుతూ భక్తుల భద్రత కోసం గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.: సలేశ్వరా జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *