నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నో స్మోకింగ్ డే సందర్భంగా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మదన్ మోహన్ ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ధూమపానం వల్ల కలిగే ప్రమాదాలను వివరించే ప్లకార్డులు ప్రదర్శిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మదన్ మోహన్ మాట్లాడుతూ ధూమపానం ఆరోగ్యానికి అత్యంత హానికరమని తెలిపారు. సిగరెట్లు, బీడీలు వంటి పొగాకు ఉత్పత్తులు మన శరీరానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం ధూమపానం కారణంగా లక్షలాది మంది క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు. ధూమపానం వల్ల కేవలం వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాదు, కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని చెప్పారు.
విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడగలరని ఆయన తెలిపారు. ఇప్పటికే ధూమపానం అలవాటు ఉన్నవారు దానిని మానుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు.
సమాజంలో ధూమపానం నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అంజయ్య, వనిత, కోదండరాములు, ఉమాదేవి, రామకృష్ణ, దశరథం తదితరులు పాల్గొన్నారు.: విద్యార్థులకు ధూమపానం దుష్ప్రభావాలపై అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *