నాగర్ కర్నూల్ జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్‌ను మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సందర్శించి ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా పంటల సమయంలో రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

రిజర్వాయర్‌లో ప్రస్తుతం మూడు మోటర్లు మాత్రమే పనిచేస్తున్నాయని, మిగతా రెండు మోటర్లను కూడా వెంటనే ప్రారంభించి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. ప్రాజెక్టులో నీటిని పూర్తిస్థాయిలో నింపి రైతులకు సకాలంలో సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాలువ వెడల్పు పనులను త్వరితగతిన చేపట్టాలని అధికారులకు సూచించిన ఆయన, ఇంజనీర్లు మరియు కొంతమంది రాజకీయ నాయకుల కక్కుర్తి వల్ల ప్రాజెక్టు పరిస్థితి దెబ్బతిందని ఆరోపించారు. రైతులకు సాగునీళ్లు అందకపోయినా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

సాగునీటి మంత్రి చేసే పర్యటనలు కేవలం చుట్టపు చూపులుగానే మిగిలిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే గుడిపల్లి కట్టపై ముళ్ళపొదలు, చెట్లు పెరిగి ఉండటంతో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కట్టపై పెరిగిన చెట్లను వెంటనే తొలగించి అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు నాగం శశిధర్ రెడ్డి, అర్థం రవి, బాలగౌడ్ తదితరులు పాల్గొన్నారు.: గుడిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన మాజీ మంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *